ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూశాకైనా సమయం వృధా చేసుకోవద్దు.. రాజకీయ నేతలకు పీకే సూచన

ఠాగూర్

ఆదివారం, 2 జూన్ 2024 (12:58 IST)
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూసిన తర్వాత సమయం వృధా చేసుకోవద్దని చర్చల్లో పాల్గొనే రాజకీయ నేతలకు జాతీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా ఇచ్చారు. ఏడు దశల సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జూన్ ఒకటో తేదీ సాయంత్రంతో ముగిశాయి. ఆ తర్వాత అనేక సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇవి తాను అంచనా వేసి ఫలితాలకు అనుకూలంగా ఉన్నాయి. ఆ తర్వాత ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తొలిసారి స్పందించారు. 
 
'ఈ సారి ఎప్పుడైనా ఎన్నికలు.. రాజకీయాలపై చర్చలు జరుగుతుంటే బూటకపు జర్నలిస్టులు, నోరేసుకుపడే రాజకీయ నాయకులు, స్వయం ప్రకటిత సోషల్‌ మీడియా మేధావుల పనికిమాలిన చర్చలు, విశ్లేషణలపై మీ సమయం వృథా చేసుకోవద్దు' అని ప్రజలకు పీకే సలహా ఇచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 300కు పైగా సీట్లు సాధిస్తుందని ప్రశాంత్‌ కిశోర్ మొదటి నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల కూడా ఆయన చేసిన ఎక్స్‌ పోస్టులో తన అంచనాల్లో ఎలాంటి మార్పు ఉండదనే ఉద్దేశం కనిపించింది. కానీ, కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిశోర్‌ గతంలో చేసిన అంచనాలు తలకిందులైన విషయాన్ని ప్రస్తావించారు. 
 
ఆ క్రమంలోనే జర్నలిస్టుకు, కిశోర్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యర్థులను సవాలు చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు. నిరాశలో కూరుకుపోయిన వారికి ఒక సలహా ఇచ్చారు. 'జూన్‌ 4న మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి' అని ఎద్దేవా చేశారు. 2021లో వెస్ట్‌ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుందని ఆయన వేసిన అంచనా నిజమైందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైకాపా ప్రభుత్వానికి ఎన్నికల ఫలితాలు షాక్‌ ఇస్తాయని ఆయన జోస్యం చెప్పిన విషయం తెలిసిందే. ఇక్కడ ఎన్‌డీఏ కూటమి భారీగా సీట్లను సాధిస్తుందని పేర్కొన్నారు. ఇక దేశ వ్యాప్తంగా తూర్పు, దక్షిణ భారతంలోనూ బీజేపీ సీట్లు, ఓట్లశాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుందని తెలిపారు. బీజేపీని అడ్డుకునేందుకు ప్రతిపక్షానికి అవకాశాలు ఉండేవని.. కానీ, బద్ధకం, తప్పుడు వ్యూహాలతో వాటిని కాలదన్నుకుందని విశ్లేషించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు