లోక్‌సభ సమరం కోసం బీజేపీ సిద్ధం... తొలి జాబితాలో చోటుదక్కని నేతలు వీరే...

ఠాగూర్

ఆదివారం, 3 మార్చి 2024 (12:15 IST)
త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, 28 మంది మహిళలు, 47 మంది 50 ఏళ్లలోపు యువకులు, ఎస్సీ- 27, ఎస్టీ- 18, ఓబీసీ- 57 మంది అభ్యర్థులు ఈ జాబితాలో ఉన్నారు. సర్వేలు, పార్టీలో అంతర్గత సమీకరణాలు, జనాభిప్రాయం ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక బీజేపీ అధిష్టానం తొలి విడత అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఫస్ట్ లిస్టులో పలువురు సీనియర్లకు చోటుదక్కలేదు.
 
సీటు రానివారిలో భోపాల్ నుంచి వివాదాస్పద ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ స్థానంలో అలోక్ శర్మ పేరుని బీజేపీ ప్రకటించింది. కీలక ఎంపీగా ఉన్న మీనాక్షి లేఖి స్థానంలో న్యూఢిల్లీకి చెందిన బన్సూరి స్వరాజ్‌‍ను పార్టీ పోటీ చేయిస్తోంది. ఆమె మాజీ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె. దక్షిణ ఢిల్లీ నుంచి రమేశ్ బిధూరి స్థానంలో రాంవీర్ సింగ్ బిధూరి, ఢిల్లీ చాందినీ చౌక్ నుంచి డాక్టర్ హర్ష్ వర్ధన్ స్థానంలో ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్లను వెల్లడించింది. 
 
పశ్చిమ ఢిల్లీ నుంచి కమల్త్ సెహ్రావత్ ను పార్టీ బరిలోకి దింపింది. విదిశ స్థానం నుంచి రమాకాంత్ భార్గవ స్థానంలో శివరాజ్ సింగ్ చౌహాను పార్టీ పెద్దలు అవకాశం కల్పించారు. గుణ లోక్‌సభ నుంచి కృష్ణ పాల్ సింగ్ యాదవ్ స్థానంలో జ్యోతిరాదిత్య సింథియా, తిరువనంతపురం నుంచి కుమ్మనం రాజశేఖరన్ స్థానంలో రాజీవ్ చంద్రశేఖర్‌ని పార్టీ పోటీలోకి దింపింది. గౌతమ్ బుద్ధ నగర్ నియోజవర్గం నుంచి పంకజ్ సింగ్ స్థానంలో మహేశ్ శర్మను బీజేపీ ఎంపిక చేసింది. 
 
అలీపురువార్ నియోజకవర్గంలో అలీపురువార్ స్థానంలో మనోజ్ తిగ్గాకు చోటిచ్చింది. డిబ్రూఘర్ నుంచి రామేశ్వర్ తేలి స్థానంలో సర్బానంద సోనోవాల్, రత్లాం స్థానం నుంచి గుమాన్ సింగ్ దామోర్ స్థానంలో అనితా నగర్ సింగ్ చౌహాన్ పేర్లను బీజేపీ ప్రకటించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు