అమేథీ నుంచి రాహుల్ - రాయ్‌బరేలి నుంచి ప్రియాంకా పోటీ!!

ఠాగూర్

బుధవారం, 6 మార్చి 2024 (16:06 IST)
దేశంలో త్వరలో జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటలైన అమేథీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్‌బెరేలీ నుంచి ప్రియాంకా గాంధీలు పోటీ చేస్తారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ప్రదీప్ సింఘాల్ తెలిపారు. ఈ రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ కంచుకోటలు. గత 1967 నుంచి 2014 వరకు అమేథీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపొందుతూ వచ్చారు. ఇక్కడ నుంచి రాహుల్ గాంధీ 2002 నుంచి వరుసగా రెండు సార్లు గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై ఆనయ ఓడిపోయారు. 
 
ఈ స్థానంలో కాంగ్రేసేతర అభ్యర్థి గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే, గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీతో పాటు కేరళ రాష్ట్రంలోని వయనాడ్ నుంచి పోటీ చేయడంతో ఆయన వయనాడ్ నుంచి విజయం సాధించి పార్లమెంట్‌‍లోకి అడుగుపెట్టారు. ఇపుడు మరోమారు ఆయన అమేథీ నుంచి పోటీ చేస్తారని కాంగ్రెస్ నేత ప్రదీప్ సింఘాల్ తెలిపారు. అదేవిధంగా ప్రియాంకా గాంధీ కూడా రాయ్‌బరేలీ నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు. అయితే, పార్టీ అధిష్టానం వీరిద్దరి పోటీపై ఓ స్పష్టత ఇస్తుందని ఆయన చెప్పారు.
 
మరోవైపు, స్మృతి ఇరానీ మరోమారు అమేథీ నుంచి బరిలో దిగుతున్నారు. బీజేపీ 195 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించగా, అందులో స్మృతి ఇరానీ పేరు కూడా ఉంది. బీజేపీ పెద్దలు స్మృతి ఇరానీకి మరోమారు అమేథీ నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు