15 ఏళ్ల బాలికపై లైంగికదాడి.. ముంబైలో మరో దారుణం

సోమవారం, 13 సెప్టెంబరు 2021 (11:02 IST)
ముంబైలో మరో దారుణం చోటుచేసుకుంది. ఉల్హాస్ నగర్ రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న రైల్వే స్టాఫ్ క్వార్టర్స్‌లో 15ఏళ్ల బాలికపై లైంగికదాడి చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఓ బాలిక శుక్రవారం తన ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి కళ్యాణ్ నుంచి లోకల్ ట్రైన్‌లో ఉల్హాస్ నగర్ వచ్చి రాత్రి 9 గంటల ప్రాంతంలో రైలు దిగింది. ముగ్గురూ కలిసి ఇంటికి వెళ్తున్నారు. 
 
అదే సమయంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఓ వ్యక్తి చేతిలో సుత్తితో వారికి అడ్డుపడ్డాడు. బాలిక ఫ్రెండ్స్‌ను బెదిరించి వారిని వెళ్లిపోవాలని లేదంటే సుత్తితో కొట్టి చంపేస్తానని బెదిరించాడు. దాంతో వారిద్దరూ బాలికను అక్కడే వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ వ్యక్తి.. బాలికను బలవంతంగా తనతో రైల్వే స్టాఫ్ క్వార్టర్స్ లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. 
 
శనివారం ఉదయం బాలిక ఎలాగో అక్కడి నుంచి తప్పించుకుని దారిలో వెళ్తున్న వ్యక్తి దగ్గర ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసింది. దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఆ ఫ్రెండ్ బాలికకు సూచించింది. అయితే బాలిక ఫిర్యాదును స్వీకరించేందుకు రెండు పోలీస్ స్టేషన్‌లలో.. కేసు తమ పరిధిలోకి రాదని చెప్పి బాలికను స్టేషన్ నుంచి పంపేసినట్టు తెలిసింది. చివరికి రైల్వే పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. 
 
కాగా, కేసు నమోదు చేసుకోని వ్యవహారంపై ముంబై రైల్వే పోలీస్ కమిషనర్ సీరియస్ అయ్యారు. ఆ రెండు పోలీస్ స్టేషన్ల అధికారులపై విచారణకు ఆదేశించారు.
 
ఘటనపై పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ బాలికకు వైద్య పరీక్షలు చేశామని, కౌన్సిలింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాన్ని పంపామని, దర్యాఫ్తు చేస్తున్నామని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు