సినీ పరిశ్రమ చనిపోయే స్థితిలో వుంది.. మహారాష్ట్రకు కంగనా విన్నపం

మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (13:01 IST)
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తంగా మహారాష్ట్రంలో థియేటర్లు మూతపడ్డాయి. ఇతర రాష్ట్రాల్లో దశ వారీగా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మార్గదర్శకాలకు లోబడి సినిమాల ప్రదర్శనకు ప్రభుత్వాలు అనుమతిస్తున్నాయి. కానీ, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం అందుకు ససేమిరా అంటోంది. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటించిన 'తలైవి' చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటి జయలలిత జీవితకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. సెప్టెంబర్ 10న 'తలైవి' సినిమా విడుదలకాబోతోంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎంజీఆర్ పాత్రలో అరవిందస్వామి నటించారు. ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 
 
మరోవైపు, ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వానికి కంగన ఒక విన్నపం చేశారు. థియేటర్లను వెంటనే తెరిచేందుకు అనుమతించాలని కోరారు. సినీ పరిశ్రమ చనిపోయే పరిస్థితిలో ఉందని... పరిశ్రమను బతికించేందుకు థియేటర్లను ఓపెన్ చేయాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. 
 
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని, ఈ నేపథ్యంలో థియేటర్లను తెరిచి పరిశ్రమను బతికించాలని కోరింది. మహారాష్ట్రలో రెస్టారెంట్లు, హోటళ్లు, కార్యాలయాలు, లోకల్ ట్రైన్స్ అన్నీ ప్రారంభమయ్యాయని... కానీ థియేటర్లను మాత్రం తెరవలేదని కంగన అన్నారు. సినిమా థియేటర్ల ద్వారానే కరోనా వ్యాప్తి అవుతోందనే విధంగా మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు