మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం... లేదంటే చనిపోతాం : ఇద్దరు యువతులు

ఆదివారం, 19 ఫిబ్రవరి 2017 (11:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు చెందిన ఇద్దరు యువతులు పెళ్లి చేసుకుంటామని పట్టుబడుతున్నారు. ఇందుకు సమ్మతించకపోతే తామిద్దరం ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో వారిద్దరికి ఎలా సర్దిచెప్పాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా వెలుగుచూసిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పక్క పక్క గ్రామాలకు చెందిన ఇద్దరు ఒకే కులానికి చెందిన అమ్మాయిలు చాలా కాలంగా ప్రేమించుకొంటున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వారు తీవ్రంగా మందలించారు. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించారు. 
 
తామిద్దరం పెళ్లి చేసుకుంటామని లేనిపక్షంలో ఆత్మహత్య చేసుకుంటామని వారు పోలీసులకు తెగేసి చెప్పారు. అయితే ఈ విషయమై రెండు కుటుంబాలకు చెందిన పెద్దలను పోలీసులు పిలిపించి చర్చించారు. అయినప్పటికీ తమను వేరు చేయవద్దని వారు కోరుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి