అధికార, ప్రతిపక్ష పార్టీలపై మాయావతి ఆగ్రహం

గురువారం, 24 సెప్టెంబరు 2020 (20:40 IST)
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరిగిన తీరుపై బీఎస్‌పీ అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్లమెంటు సమావేశాల్లో గందరగోళానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు బాధ్యత వహించాలని ఆమె డిమాండు చేశారు.

ఇరు పక్షాల ప్రవర్తన పార్లమెంటు, రాజ్యాంగ ప్రతిష్టకు హాని కలిగిస్తుందని ఆరోపించారు. ఈ మేరకు మాయావతి హిందీలో ట్వీట్‌ చేశారు. పార్లమెంటును ప్రజాస్వామ్యానికి దేవాలయంగా పిలుస్తున్నప్పటికీ అనేకసార్లు దాని ప్రతిష్టను దిగజార్చారని మాయావతి అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత సమావేశాల్లోనూ సభలో అధికార, ప్రతిపక్షాలు అనుసరిస్తున్న విధానం, ప్రవర్తన పార్లమెంటు ప్రతిష్టను మంటగలిపేలా ఉన్నాయని పేర్కొన్నారు. పార్లమెంటును, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని, ఇది విచారకరమని ఆమె వ్యాఖ్యానించారు.

వ్యవసాయ బిల్లుల ఆమోదం సమయంలో రాజ్యసభలో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యవహరించిన తీరు, 8మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు వేయడం వంటి అంశాలను ఆమె గుర్తు చేశారు.

బిల్లుల ఆమోదం సమయంలో ప్రతిపక్షాలు సైతం సక్రమంగా వ్యవహరించలేదని, ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే చర్యలేమీ చేయలేదని మాయావతి తెలిపారు. బీజేపీకి సరిపడా సభ్యులు లేనప్పుడు ఓటింగ్‌కు ఎందుకు పట్టుపట్టలేదని ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు