ఒక్క సీటుతో బీజేపీ ప్రభుత్వం కూలిన సందర్భం ఉంది : రాజ్‌ఠాక్రే

ఆదివారం, 3 నవంబరు 2019 (12:11 IST)
ఇటీవల వెల్లడైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) కేవలం ఒక్క సీటును గెలుచుకుంది. కళ్యాణ్ రూరల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఎంఎన్ఎస్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిని ఓడించి గెలుపుబావుటా ఎగురవేశారు. 
 
ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్ చీప్ రాజ్‌ఠాక్రే మరాఠా దిగ్గజ నేత, ఎన్సీపీ చీప్ శరద్ పవార్‌తో సమావేశమయ్యారు. పది నిమిషాల సేపు ఉభయులూ సమావేశమైనట్టు ఎంఎన్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
 
దీనిపై ఎంఎన్‌ఎస్ వర్గాలు మాట్లాడుతూ, బీజేపీ తన మెజారిటీని నిరూపించుకోవడంలో విఫలమైన పక్షంలో ప్రభుత్వం ఏర్పాటులో ఒక్క సీటు కూడా కీలకమే అవుతుందని, ఈ కోణంలోంచి చూసినప్పుడు పవార్‌ను రాజ్‌థాక్రే కలుసుకోవడం కూడా కీలకమే అవుతుందని తెలిపాయి.
 
మరోవైపు, ఎన్నికల ఫలితాలు వెలువడి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో జాప్యం చోటుచేసుకున్నప్పుడు రాజకీయ సమీకరణలు కూడా మారిపోతుంటాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులంటూ ఉండరని ఇలాంటి సమయాల్లో మళ్లీ మళ్లీ నిరూపితమవుతుంటుంది. 
 
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ-శివసేన కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ 12 రోజులుగా ప్రభుత్వం ఏర్పాటు విషయంలో మీనమేషాలు లెక్కబెడుతున్నాయి. దీంతో చిన్నాచితకా పార్టీలు సైతం ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి మద్దతు తెలిపేందుకు తమ వంతు పావులు కదుపుతున్నాయి. ఇందులోభాగంగా, ఎంఎన్ఎస్ చీఫ్ ఎన్సీపీ చీఫ్‌తో సమావేశమయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు