ముంబై -అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ కారిడార్ విశేషాలు ఇవే...

ఠాగూర్

మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (10:37 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలల ప్రాజెక్టుగా భావిస్తున్న ముంబై - అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ కారిడార్ విశేషాలను భారత రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇదే విషయంపై ఆయన ఓ ట్వీట్‌తో పాటు ఓ వీడియోను కూడా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు. ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే గంటకు గరిష్టంగా 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లుంది. అంటే 508 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబై - అహ్మదాబాద్ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం కేవలం రెండు గంటలు మాత్రమే పడుతుంది. ఈ బుల్లెట్ కారిడార్‌లో 24 వంతెనలు నిర్మించనున్నారు. 
 
మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఓ వీడియోను షేర్ చేస్తూ, "తమ ప్రభుత్వం కలలు కాదు, వాస్తవాలను సృష్టిస్తోంది" అని పేర్కొన్నారు. 'బుల్లెట్‌ రైలు' కోసం ప్రధాని నరేంద్ర మోడీ మూడో పాలనలో ఎదురుచూడండంటూ రాసుకొచ్చారు. అంతేగాక ఈ ప్రాజెక్టును ప్రపంచస్థాయి ఇంజినీరింగ్‌ అద్భుతంగా అశ్వినీ వైష్ణవ్‌ అభివర్ణించారు. దీన్ని భారత భవిష్యత్తుగా వీడియోలో పేర్కొన్నారు.
 
దేశంలోనే తొలిసారి స్లాబ్‌ ట్రాక్‌ వ్యవస్థ, భూకంపాలను ముందుగానే పసిగట్టే ఏర్పాట్లు, 28 స్టీల్​ బ్రిడ్జీలు, ఏడు సొరంగాలు, సముద్రగర్భంలో ఏడు కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 12 రైల్వేస్టేషన్లు తదితర విశేషాలను మంత్రి వీడియోలో ప్రస్తావించారు. కాగా, ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.1.08 లక్షల కోట్లు. తొలి ప్రయోగాత్మక పరుగును 2026లో చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
అహ్మదాబాద్‌ - ముంబై ప్రాంతాల మధ్య అందుబాటులోకి రానున్న తొలి బుల్లెట్‌ రైలులో కొంతభాగం ఆగస్టు 2026 నాటికి సిద్ధం కానుందని ఇదివరకే రైల్వే మంత్రి ప్రకటించారు. గుజరాత్‌లోని సూరత్‌ నుంచి బిలిమోరా వరకు 50కి.మీ దూరం పూర్తవుతుందన్నారు. 508.17 కిలోమీటర్ల మేర పొడవున్న ఈ రైలు కారిడార్‌లో ఇప్పటికే 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్‌ సూపర్‌ స్ట్రక్చర్‌ నిర్మాణం జరిగిందని మంత్రి వెల్లడించారు. ఇక ఈ బుల్లెట్​ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 3 గంటల్లోపే అహ్మదాబాద్‌ నుంచి ముంబయి చేరుకోవచ్చు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు