ఎన్డీటీవీ హిందీ ప్రసారాలపై నిషేధం విధింపులో తప్పులేదు : వెంకయ్య నాయుడు

ఆదివారం, 6 నవంబరు 2016 (09:52 IST)
దేశ రక్షణ, భద్రత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఎన్డీటీవీ హిందీ వార్తా ఛానెల్‌పై ఒకరోజు నిషేధం విధించినట్లు కేంద్ర సమాచార - ప్రసార శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు వివరణ ఇచ్చారు. ఈ విషయంలో విపక్షాలు రాజకీయం చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో రాజీ లేదన్నారు. గతంలోనూ ఇలాంటి ఆంక్షల్ని ప్రభుత్వాలు విధించాయని గుర్తుచేశారు. 
 
ప్రసార మాధ్యమాల స్వేచ్ఛపై ప్రధాని మోడీ సర్కారుకు అత్యంత గౌరవం ఉందని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించినందుకే టీవీ ఛానెల్‌పై నిషేధం విధించినట్లు వివరించారు. పఠాన్‌కోట్‌ దాడి సందర్భంగా ఆ ఛానెల్‌ ప్రసారం చేసిన దృశ్యాలను ఉగ్రవాదులు చూస్తే సైనికులు, పౌరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు. విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఎటువంటి అంశాలు లేకపోవడంతో ఈ విషయాన్ని వివాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 
 
ఇకపోతే.. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు సీఎం జయలలిత పూర్తిగా కోలుకున్నారని, త్వరలో ఆమె నివాసానికి చేరుకుంటారనే వార్త సంతోషాన్నిస్తోందని తెలిపారు. ఆమె ఓ ధీరవనిత అని కితాబిచ్చారు. ఆమె మళ్లీ రోజువారీ కార్యకలాపాల్లో త్వరగా పాల్గొనాలని ఆకాంక్షించారు. 

వెబ్దునియా పై చదవండి