కరోనా కల్లోలం : ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (12:18 IST)
దేశంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైంది. ఈ రెండు రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ కేజ్రీవాల్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గం.ల నుంచి వేకువజామను 5 గం.ల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. 
 
అయితే ఎమర్జెన్సీ సేవలు, ఎమర్జెన్సీ వాహనాలను మాత్రం కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. రాత్రిపూట కర్ఫ్యూ ఆదేశాలు తక్షణమే అమలులోకి వచ్చాయి. ఈ నెల 30 వరకు రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
 
ఢిల్లీలో కోవిడ్ పరిస్థితిపై శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్షించిన అర్వింద్ కేజ్రీవాల్… ప్రస్తుతానికి దేశ రాజధానిలో లాక్‌డౌన్ విధించే యోచన లేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం దిల్లీలో నాలుగో వేవ్ నడుస్తున్నట్లు చెప్పారు. అనివార్యమని భావిస్తే రాష్ట్ర ప్రజలతో చర్చించిన తర్వాత తది నిర్ణయం తీసుకుంటామన్నారు.  
 
ఢిల్లీ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన కోవిడ్ బులెటిన్ మేరకు…24 గంటల వ్యవధిలో 15 మంది కరోనా బారినపడి మృతి చెందగా 3,548 కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 6,79,962కు చేరుకోగా… వీరిలో 6.54 లక్షల మంది రికవరీ అయ్యారు. కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో తక్షణమే దిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూను అమలుచేయాలని కేజ్రీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు