పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్తో ఉన్న సింధూ జలాల పంపిణీ ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసింది. ఇది పాకిస్థాన్కు ఏమాత్రం మింగుడుపడలేదు. పైగా, ఈ ఒప్పందం చెల్లుబాటు కాదని, అంతర్జాతీయంగా న్యాయపోరాటం చేస్తామని, ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేస్తామంటూ పాకిస్థాన్ పాలకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా స్పందించారు.
భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరిన నేపథ్యంలో అజయ్ బంగా భారత్ పర్యటనలో ఉన్నారు. శుక్రవారం ఆయన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత ప్రపంచ బ్యాంకు నిధులతో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇండస్ ట్రీటీ విషయంలో తమ సంస్థ జోక్యం చేసుకుని పరిష్కరిస్తుందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన తెలిపారు.