జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. ఇందుకోసం మంగళవారం అర్థరాత్రి ఆపరేషన్ సింధూరం పేరుతో త్రివిధ దళాలు దాడులు మొదలుపెట్టాయి. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత సైనిక బలగాలు దాడులకు పూనుకున్నాయి. ఈ దాడుల్లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసమయ్యాయి. దాదాపు 80 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం.
కాగా, భారత దళాలు ధ్వంసం చేసిన స్థావరాల్లో మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్పూర్ - జేఈఎం, మర్కజ్ తైబా, మురిడ్కే ఎల్టీ, సర్జల్, తెహ్రా కలాన్ జేఈఎం, మజోయా, సియాల్ కోట్ హెచ్ఎం, మర్కజ్ అహలే హదీస్, బర్నాలా - ఎల్టీ, మర్కజ్ అబ్బాస్, కోట్లి జేఈఎం, మస్కార్ రహీల్ షాహిద్, కోట్లి - హెచ్ఎం, షవాయ్ నల్లా క్యాంప్, ముజఫరాబాద్ ఎల్దస్ఈటీ, సయ్యద్నా బిలాల్ క్యాంప్, ముజఫరాబాద్ జేఈఎంలు ఉన్నాయి.
పహల్గాంలో సేదతీరుతున్న పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడులకు ప్రతీకారంగా భారత్ మంగళవారం అర్థరాత్రి దాడులకు దిగింది. పాకిస్థాన్తో పాటు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ త్రివిధ దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు సమాచారం.
మరోవైపు, భారత్ దాడులతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్ కోట్తో పాటు అనేక ఎయిర్ పోర్టులను 48 గంటల పాటు మూసివేసింది. భారత్ ప్రతీకార దాడులు చేపట్టిన అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు. దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు.
ఇదిలావుంటే, పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. భారత్, పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచించారు. 'ఇది హేయమైన విషయం. వారు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారు. దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలి. రెండు శక్తిమంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరు. భారత్, పాక్కు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు వద్దు' అని కోరారు.