ఆపరేషన్ సిందూర్ దెబ్బకు బెంబేలెత్తిన పాకిస్థాన్... ఎయిర్‌పోర్టులు మూసివేత!!

ఠాగూర్

బుధవారం, 7 మే 2025 (08:56 IST)
పహల్గాంలో సేదతీరుతున్న పర్యాటకులపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన దాడులకు ప్రతీకారంగా భారత్ మంగళవారం అర్థరాత్రి దాడులకు దిగింది. పాకిస్థాన్‌తో పాటు.. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ త్రివిధ దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 80 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టు సమాచారం. 
 
మరోవైపు, భారత్ దాడులతో పాకిస్థాన్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్ కోట్‌తో పాటు అనేక ఎయిర్ పోర్టులను 48 గంటల పాటు మూసివేసింది. భారత్ ప్రతీకార దాడులు చేపట్టిన అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు. దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు. 
 
అదేసమయంలో దాడుల అనంతరం భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూడా అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా.. నిలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మొహరించాయి. బుధవారం ఉదయం 10.30 గంటలకు పాక్ ప్రధాని షరీప్ జాతీయ భద్రతా కమిటీతో సమావేశం కానున్నారు.
 
ఇదిలావుంటే, పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. భారత్, పాకిస్థాన్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచించారు. 'ఇది హేయమైన విషయం. వారు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారు. దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలి. రెండు శక్తిమంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరు. భారత్, పాక్‌కు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి. ఘర్షణలు వద్దు' అని కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు