"ఆపరేషన్ సింధూర్" అంటే ఏమిటి!

ఠాగూర్

బుధవారం, 7 మే 2025 (08:25 IST)
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మగంళవారం అర్థరాత్రి పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడులకు 'ఆపరేషన్ సింధూర్' అని నామకరణం చేసింది. ఇలాంటి పేరు పెట్టడంలోనూ బలమైన సందేశం ఇమిడివుంది. 
 
ఏప్రిల్ 22వ తేదీన పహల్గాంలోని బైసరన్ లోయలో సేదతీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరుచేసి, వారిని మతం అడిగి మరీ కాల్చి చంపేశారు. ఉగ్రమూకల టార్గెట్‌ చేసిన జంటల్లో అప్పటికి వివాహం చేసుకుని కేవలం ఆరు రోజులే అయిన నూతన వధూవరులు వినయ్ నర్వాల్, హిమాన్షిలు ఉన్నారు. ఉగ్రవాదులు వినయ్‌ను హత్య చేయగా, అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. 
 
పైగా, వినయ్ భారత నేవీ అధికారి కావడం గమనార్హం. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా సింధూరాన్ని చూడొచ్చు. యోధులకు పెట్టే వీరతిలకం అనే అర్థం కూడా ఉంది. అందుకే ఈ ఆపరేషన్‌కు సింధూరం అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్‌కు త్రివిధ దళాలు సమన్వయంతో నిర్వహించాయి. కాశ్మీర్‌లో సీమాంతర ఉగ్రవాదానికి కారణమైన లష్కర్ తోయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్  సంస్థల కీలకమైన క్యాంపులను నేలమట్టం చేశాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు