శశికళ సర్కారుకు ఓపీఎస్ చెక్.. అసెంబ్లీలో ఫ్లోర్ టెస్టుపై సుప్రీం కోర్టులో పిటిషన్

శుక్రవారం, 10 మార్చి 2017 (16:31 IST)
అన్నాడీఎంకే పగ్గాలు శశికళ వర్గీయుల చేతికి పోవడంతో మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని మంటగలిపేందుకు శశివర్గీయులు ప్లాన్ చేస్తున్నారని.. అధికారంలో ఉన్నంతకాలం బాగా డబ్బు దోచుకునేందుకు రంగ సిద్ధం చేస్తున్నారని శశికళ వర్గీయులపై ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 18వ తేదీన  అసెంబ్లీలో జరిగిన విశ్వాస తీర్మానంపై మాజీ సీఎం పన్నీరు సెల్వం సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. 
 
విశ్వాస తీర్మానంలో ఆ రోజు పళనిస్వామి బలం నిరూపించుకున్నారు. కానీ ఆ రోజు సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ జరిగిన తీరు సరిగా లేదని, బలవంతంగా విపక్షాలను బయటకు పంపించి విశ్వాస తీర్మానంలో నెగ్గారనే ఆరోపణలనున్నాయి. దీనిపై సుప్రీంను ఆశ్రయించాలని ఓపీఎస్ రెడీ అయిపోయారు. ఈ విధంగా శశికళ ప్రభుత్వానికి చెక్ పెట్టాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. 
 
ఆర్టికల్ 32 కింద పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధం కావాలని ఢిల్లీలోని తన లాయర్లకు పన్నీరు సెల్వం చెప్పినట్లు సమాచారం. అంతేకాదు, ఇది కోర్టు ముందుకు త్వరగా విచారణకు వచ్చేలా చూడాలని కూడా కోరినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి