చెన్నైలో కరోనా వైరస్ వ్యాప్తికి కుట్ర? ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు దర్శనం

మంగళవారం, 5 మే 2020 (09:34 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. మన దేశంలోని మెట్రో నగరాల్లో చెన్నై మహానగరం ఒకటి. ఈ నగరంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. ప్రతి రోజూ వందల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా, గ్రేటర్ చెన్నై నగర పాలక సంస్థ పరిధిలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు నగర పాలక సంస్థ అధికారులతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ అవి ఏమాత్రం ఫలించడం లేదు. ఫలితంగా చెన్నై నగరం కరోనా కోరల్లో చిక్కుకునిపోయింది. 
 
ఈ పరిస్థితుల్లో చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు దర్శనమిస్తుండటం ఇపుడు కలకలం రేగుతోంది. నోట్ల మాటున కరోనాకు కుట్ర జరుగుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
నగరంలోని పురసైవాక్కం, వెస్ట్‌ మాంబళం, మాధవరం తదితర ప్రాంతాల్లోని ఇళ్ల ముందు రాత్రివేళ నోట్లు దర్శనమిస్తున్నాయి. ఈ నెల 2వ తేదీన రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చెన్నై మాధవరం పాలకొట్టం సమీపంలోని కేకే తాళై మాణిక్యం వీధిలో ఇళ్ల ముందు రూ.20, రూ.50, రూ.100 కరెన్సీ నోట్లను చల్లి వెళ్లిపోయారు. గమనించిన కొందరు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా చిక్కలేదు.
 
నోట్లు చల్లిన వారి తీరు అనుమానాస్పదంగా ఉండడంతో వాటిని తీసుకునేందుకు జనం భయపడ్డారు. నోట్లను వీడియో తీసిన ఓ మహిళ ఇలాంటివి ఇళ్ల ముందు కనిపిస్తే తీసుకోవద్దని, కరోనా సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పోలీసులు స్పందించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు