రాష్ట్రపతికి కరోనా పరీక్షలు.. అన్ని కార్యక్రమాలు రద్దు

శనివారం, 21 మార్చి 2020 (09:21 IST)
కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ నిర్ణయించుకున్నారు. దీంతో ఆయన అన్ని రకాల అధికారిక, వ్యక్తిగత పర్యటనలను రద్దు చేసుకున్నారు. 
 
ఇటీవల బాలీవుడ్ సింగ్ కనికా కపూర్ లండన్‌ పర్యటనకు వెళ్లి వచ్చింది. ఆ తర్వాత ఆమె ఎలాంటి వైద్య పరీక్షలు చేయించుకోకుండానే, పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి అనేక మంది సినీ సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, హితులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కనికాకు పరీక్షలు చేయగా, ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆమె పార్టీలో పాల్గొన్నవారందరికీ ఈ వైరస్ సోకిందన్న భయం పట్టుకుంది.
 
ఇదిలావుంటే, పార్టీకి బీజేపీ యువ ఎంపీ దుష్యంత్ సింగ్ కూడా హాజరయ్యారు. కనికకు 'కరోనా' ఉందన్న వార్తల నేపథ్యంలో తనకు కూడా ఈ వైరస్ సోకిందన్న అనుమానంతో ఆయన హోం క్యారంటైన్‌కు వెళ్లారు. ఆ తర్వాత ఆయన బీజేపీ ఎంపీల బృందంతో వెళ్లి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. 
 
ఈ నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రామ్ నాథ్ కోవింద్ వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. అలాగే అన్ని అధికారిక కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నట్టు సమాచారం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు