'చప్పట్ల ధ్వని'తో రీసౌండ్ రావాలి... అంతే : 'జనతా కర్ఫ్యూ'పై మహేష్ ట్వీట్

శనివారం, 21 మార్చి 2020 (08:08 IST)
కరోనా వైరస్ కట్టడి కోసం ఈ నెల 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ అమలుకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ప్రతి ఒక్కరూ తమవంతు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ కోవలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ కార్యక్రమానికి తన మద్దతు ప్రకటించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు.
 
ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ట్విట్టర్ ద్వారా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. మనల్ని రక్షించేందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టిన ధైర్యశీలులకు శెల్యూట్ చేద్దామని పిలుపునిచ్చాడు. 
 
ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లో నిల్చుని మనం కొట్టే చప్పట్లు ప్రతిధ్వనించాలని, మనం వారికిచ్చే గౌరవం వాటిలో కనిపించాలని అన్నాడు. ప్రధాని పిలుపును అందరూ పాటించాలని, కరోనాను తరమికొట్టేందుకు ప్రతి ఒక్కరు జనతా కర్ఫ్యూలో భాగస్వాములు కావాలని మహేశ్‌బాబు పిలుపునిచ్చాడు.
 
కాగా, ప్రధాని మోడీ ఇచ్చిన ఈ జనతా కర్ఫ్యూకు విశేష స్పందన వస్తోంది. ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. ప్రధాని మోడీ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలని పిలుపునిస్తున్నారు. తద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టే మహత్కర కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు