బల నిరూపణకు ముందే చేతులెత్తేసిన నారాయణ... కుప్పకూలిన సర్కారు!

సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (11:46 IST)
రాష్ట్ర హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. సోమవారం అసెంబ్లీ ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి బలనిరూపణ చేసుకోవాల్సివుండగా, ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో నాలుగున్నరేళ్ళకు పైగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. 
 
మొత్తం 26 మంది సభ్యులు కలిగిన పుదుచ్చేరి శాసనసభలో ప్రభుత్వాన్ని కొనసాగించాలంటే, కనీసం 14 మంది సభ్యులు ఉండాల్సి వుండగా, ప్రస్తుతం కాంగ్రెస్ కేవలం 9 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. డీఎంకేకు 2, ఏఐఏడీఎంకేకు 4, ఏఐఎన్ఆర్సీకి 7, బీజేపీకి 3, స్వతంత్రులుగా ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 26 మంది కాగా, కేవలం 9 మందికి పరిమితమైన కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం కుప్పకూలిపోయింది. 
 
ఇదే సమయంలో మరో పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో రాష్ట్రపతి పాలన తప్పదని అంచనా. ఏఐఎన్ఆర్సీ, బీజేపీ, అన్నాడీఎంకే కలిస్తే మాత్రం మరి కొన్ని నెలల పాటు అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. 
 
తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ స్నేహపూరితంగానే ఉండటంతో అది సంభవమని భావించినా, కేవలం రెండు నుంచి మూడు నెలల పాలనకు మొగ్గు చూపి, అధికారాన్ని చేపడతారా? అన్న విషయంలో సందిగ్థత నెలకొంది.
 
నిజానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులతో పాటు ముగ్గురు రాజీనామా చేశారు. అలాగే, కూటమిలోని భాగస్వామిగా ఉన్న డీఎంకేకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు శుక్రవారం రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో సభలో బలనిరూపణ చేసుకోవాల్సిందిగా ఇన్‌ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నరుగా ఉన్న తమిళిసై సౌందర్ రాజన్ ఆదేశించారు. దీంతో సోమవారం ఉదయం బలనిరూపణ జరగాల్సివుంది. కానీ, బల నిరూపణతో సంబంధం లేకుండానే సీఎం నారాయణ స్వామి తన పదవికి రాజీనామా చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు