రోజంతా ఎండలో కట్టేశాడనీ... యజమాని తల కొరికేసిన ఒంటె.. ఎలా?

బుధవారం, 25 మే 2016 (13:24 IST)
పగలు, ప్రతీకారాలు, కోపాలు మనుషులకే అనుకుంటే పొరపాటు.... జంతువులు కుడా పగతీర్చుకుంటాయని తెలుసా... అలాంటి ఒక ఘటనే రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. ఆ ఒంటె యజమాని దాన్ని ఎండలో కట్టి ఉంచాడని కోపంతో యజమాని తలను యాపిల్ పండు కొరికినట్టు కొరికి చంపేసింది. 
 
పూర్తి వివరాల్లోకి వెళ్తే... రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి తన ఒంటెను యథావిధిగా రాత్రి పూట ఇంటి బయట కట్టేసి ఉంచాడు. అయితే మరుసటి రోజు ఉదయం అనుకోనివిధంగా యజమాని ఇంటికి బంధువులు రావడంతో కట్టేసి ఉంచిన ఒంటెను చల్లటి ప్రదేశంలోకి మార్చడం మర్చిపోయాడు. దీంతో రోజంతా 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో సలసల కాగే ఎండలో అది మాడిమాసై పోయింది. 
 
ఒంటెను ఎండలోనే కట్టేసి ఉంచిన విషయం ఆలస్యంగా గుర్తుకు రావడంతో వెంటనే ఒంటెను చల్లటి ప్రదేశానికి మార్చడానికి యజమాని వెళ్లాడు. ఆ యజమానిని చూడగానే ఉక్రోషంతో ఊగిపోయిన ఒంటె ఒక్కసారిగా అతని మీద దాడి చేసి అతని తలను కొరికేసి, అతని పీకను పట్టుకుని అటు ఇటు విసిరికొట్టింది. దీంతో ఆ ఒంటె యజమాని అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఆఖరికి ఆ ఒంటెను 25 మంది గ్రామస్తులు 6 గంటల పాటు శ్రమించి ఒంటెను శాంతింపజేశారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని ఒంటె యజమానులు భయాందోళనలకు గురయ్యారు. 

వెబ్దునియా పై చదవండి