అస్తవ్యస్తంగా మహారాష్ట్ర - రాష్ట్రపతి పాలనకు డిమాండ్

మంగళవారం, 23 మార్చి 2021 (16:28 IST)
మహారాష్ట్రలో పాలన అస్తవ్యస్తంగా మారిందని, అందువల్ల ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా చీఫ్ అయిన అథవాలే.. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
 
రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, కాబట్టి అక్కడి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని రిపబ్లికన్ పార్టీ డిమాండ్ చేస్తోందని అథవాలే ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా, బీజేపీ ఎంపీలు లోక్‌సభలో ఇదే తరహా డిమాండ్ చేసిన కొన్ని గంటలకే అథవాలే లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 
 
కాగా, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలను లోక్‌సభ జీరో అవర్‌లో బీజేపీ సభ్యుడు మనోజ్ కోటక్ లేవనెత్తారు. మహారాష్ట్ర ప్రభుత్వం తన అధికారులను డబ్బుల వసూళ్ల కోసం వినియోగిస్తోందని ఆరోపించారు. ఈ అంశం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. 
 
ఇది చాలా తీవ్రమైన అంశమని, హోం మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా రాజీనామా చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని మనోజ్ కోటక్ డిమాండ్ చేశారు.
 
మరోవైపు, మహారాష్ట్రలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి తారా స్థాయికి చేరింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో లాక్డౌన్‌తో పాటు.. రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసేలా ముంబై మాజీ సీపీ వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇపుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు