వచ్చే యేడాది సెప్టెంబరు నెలలో జమిలి ఎన్నికలు : ఈసీ

గురువారం, 5 అక్టోబరు 2017 (11:13 IST)
వచ్చే యేడాది సెప్టెంబరు నెలలో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండగలమని ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన ఇంటర్నెట్ ఆధారిత ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ఈఆర్‌వో) నెట్‌వర్క్ యాప్‌ను ఎన్నికల కమిషన్ బుధవారం ప్రారంభించింది. 
 
ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు మీకేం కావాలని కేంద్రప్రభుత్వం అడిగింది. అందుకు జవాబుగా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, ఓటు తనిఖీ యంత్రాల (వీవీపీఏటీ) కొనుగోలుకు నిధులు సమకూర్చాలని కోరినట్టు చెప్పారు. 
 
వచ్చే యేడాది సెప్టెంబర్ నాటికి జమిలి ఎన్నికలకు సంసిద్ధంగా ఉంటామన్నారు. అయితే జమిలి ఎన్నికలపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అందుకు తగిన చట్టపరమైన సవరణలు చేయాల్సి ఉంటుందన్నారు. వచ్చే సెప్టెంబర్ నాటికి 40 లక్షల వీవీపీఏటీ యంత్రాలను సమకూర్చుకోగలమన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు