గూగుల్ మ్యాప్‌ను ఫాలో అయ్యారు... గాల్లో వేలాడారు...

ఠాగూర్

మంగళవారం, 10 జూన్ 2025 (12:40 IST)
గూగుల్ మ్యాప్స్ వచ్చాక చాలా మంది తమకు కావాల్సిన ప్రదేశాల చిరునామా కోసం వాటిని ఫాలో అవుతున్నారు. అయితే, ఈ మ్యాప్స్ ఫాలో అయ్యేవారిలో కొందరు కొన్ని సమయాల్లో చిక్కుల్లో పడుతున్నారు. అయితే, ఈ మ్యాప్స్‌‍ను గుడ్డిగా నమ్మవద్దని తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన తెలియజేస్తుంది. మ్యాప్‍లో గమ్యం ఫీడ్ చేసి, అది చూపించిన మార్గంలో గుడ్డిగా వెళితే ఒక్కోసారి ప్రమాదంలో పడతామని హెచ్చరిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్ గంజ్‌లో ఆన్‌లైన్ మ్యాప్ చూస్తూ డ్రైవర్ కారు నడపడంతో అదికాస్తా నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్‌‍పైకి తీసుకెళ్లింది. 
 
ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తికాకపోవడంతో కారు గాల్లో వేలాడుతూ ఆగిపోయింది. ఈ ఘటన జాతీయ రహదారి 24పై జరిగింది. అదృష్టవశాత్తు కారులోని వారందరూ సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పింది. కారు డ్రైవర్ ఆన్‌లైన్ మ్యాప్‌‍ సూచనలను అనుసరిస్తూ వెళ్లడమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ మ్యాప్ గుర్తించకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గత యేడాది కూడా ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. అయితే, అది విషాదంగా ముగిసింది. గూగుల్ మ్యాప్స్ చూస్తూ ప్రయాణిస్తున్న ఓ కారు నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరూ సోదరులతో సహా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. బరేలి నుంచి బదౌన్ జిల్లాలోని దాతాగంజ్‌కు వెళుతుండగా ఫరీద్ పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. దెబ్బతిన్న వంతెన గురించి గూగుల్ మ్యాప్స్‌లో సమాచారం లేకపోవడంతో డ్రైవర్ కారును దానిపైకి నడిపాడు. దీంతో వాహన దాదాపు 50 అడుగుల లోతున్న నదిలోపడిపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు