ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్... ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (09:34 IST)
పశ్చిమ బెంగాల్‌తో పాటు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. బెంగాల్, అసోంలలలో మూడవ దశ పోలింగ్ జరుగుతుండగా, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలోని అన్ని స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అసోంలోని గువాహటీలో గల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. 
 
మంగళవారం అసోంలో జరుగుతున్న మూడవ దశ ఎన్నికలలో అసోం ఆరోగ్యశాఖ మంత్రి, బీజేపీ నేత హిమంత్ బిశ్వాతో పాటు 337 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక బెంగాల్ విషయానికొస్తే బీజేపీ నేత స్వప్ప దాస్ గుప్తా, టీఎంసీ నేత ఆషిమా పాత్ర, సీపీఎం నేత కాంతి గంగూలీ ఎన్నికల్ బరిలో ఉన్నారు. బెంగాల్‌లో ఈరోజు 31 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
 
తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మంగళవారం పోలింగ్ మొదలైంది. ఈ నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతంతో కలిపి మొత్తంగా 824 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, వాటిలో 475 స్థానాలకు మంగళవారమే పోలింగ్ జరుగుతోంది.
 
పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతమైనప్పటికీ ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. ఎన్నికైన ముఖ్యమంత్రితో కలిసి నామినేట్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ పరిపాలన కొనసాగిస్తారు. గత ఫిబ్రవరి 22న అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో విఫలం కావడంతో ముఖ్యమంత్రి పదవికి వీ నారాయణ స్వామి రాజీనామా చేయాల్సి వచ్చింది.
 
ఇక్కడ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. డీఎంకేతో కలిసి బరిలోకి దిగింది. కొన్ని చిన్న పార్టీలు, వామపక్షాలు కూడా వీరి కూటమిలో ఉన్నాయి. మరోవైపు ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నా డీఎంకే, మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి బీజేపీ బరిలోకి దిగుతోంది.
 
పుదుచ్చేరి అసెంబ్లీలో 33 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మూడు స్థానాలకు ప్రముఖులను నామినేట్ చేస్తారు. మిగతా 30 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 5 రిజర్వుడు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు