తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. మీ నాయుకుడు విగ్రహ ఏర్పాటుకు ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారంటూ ప్రశ్నించింది. డీఎంకే మాజీ అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. మీ నేతలను కీర్తించేందుగు ప్రజాధనాన్ని ఎలా వినియోగిస్తారని ప్రశ్నించారు. పైగా, ప్రభుత్వం తన పిటిషన్ను ఉపసంహరించుకుని, ఈ అంశంపై రాష్ట్ర హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది.
తిరునెల్వేలి జిల్లాలోని వల్లియూర్ వెజిటేబుల్ మార్కెట్ ప్రవేశద్వారం వద్ద కరుణానిధి కాంస్య విగ్రహం ఏర్పాటుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరింది. ఆ పిటిషన్పై అసహనం వ్యక్తంచేసిన అత్యున్నత న్యాయస్థానం... గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వలేదని హైకోర్టు అప్పుడు స్పష్టంచేసింది. ఇలాంటి ఏర్పాట్ల వల్ల ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారని అనుమతి నిరాకరించింది.
విగ్రహాల ఏర్పాటుకు ఎలాంటి అనుమతి ఇవ్వకూడదంటూ గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని గుర్తుచేసింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. తమిళనాడు రాజకీయాలపై కరుణానిధి చెరగని ముద్ర వేశారు. దశాబ్దాల పాటు డీఎంకే పార్టీని నడిపిన ఆయన.. ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. తమిళం మాట్లాడే ప్రజల హక్కుల కోసం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు.