తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం.. 19 నుంచి 30వరకు లాక్‌డౌన్

సోమవారం, 15 జూన్ 2020 (16:28 IST)
తమిళనాడు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. చెన్నైలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో చెన్నైతో పాటు చెంగల్ పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు సీఎం పళని స్వామి ప్రకటించారు. ఈ నెల 19 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. 
 
సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ నుంచి సడలింపులు ఇచ్చిన తర్వాత.. మళ్లీ కఠిన ఆంక్షలు విధించిన తొలి రాష్ట్రం తమిళనాడు నిలిచింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులకు అనుమతిస్తారు. హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిళ్లకు అనుమతి వుంటుంది. మధ్యాహ్నం 2 తర్వాత ఎటువంటి షాపులు తెరవకూడదు. ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకూడదని స్పష్టం చేసింది.
 
కాగా, మన దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడులోనే అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి వరకు తమిళనాడులో 44,661 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 24,547 మంది కోలుకోగా.. 435 మంది మృతి చెందారు. తమిళనాడులో నమోదైన కేసుల్లో అత్యధికం చెన్నైలోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే చెన్నై చుట్టుపక్కల ప్రాంతాల్లో మళ్లీ సంపూర్ణ లాక్‌డౌన్ విధించినట్లు తమిళనాడు సర్కారు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు