తమిళనాడు పోల్ రిజల్ట్స్ : అన్నాడీఎంకేకు 134 - డీఎంకే 89 - కాంగ్రెస్ 8

శుక్రవారం, 20 మే 2016 (09:26 IST)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అన్నాడీఎంకే 134 సీట్లను కైవసం చేసుకుంది. అలాగే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తలకిందిలు కావడంతో డీఎంకే 98 సీట్లతో సరిపెట్టుకుంది. ఫలితంగా రెండాకుల పార్టీ వరుసగా రెండో సారీ అధికారంలోకి వచ్చింది. అధికార పార్టీకే తమిళనాడులో మళ్లీ అధికారాన్ని కట్టబెట్టడం గత మూడు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. మొత్తం 234 నియోజక వర్గాలకు గాను 134 స్థానాలు సాధించి అన్నా డీఎంకే ఘన విజయం సాధించింది. 
 
అయితే, గత 2011 ఎన్నికల్లో 150 సీట్ల(అన్నాడీఎంకే కూటమి 203)ను సాధించిన ఆ పార్టీ ఈసారి 16 స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ఇక, అధికార రేసులో వెనకపడిన డీఎంకే కూటమి పార్టీలు 98 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇందులో డీఎంకే 89 సీట్లలో గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ 8 సీట్లలో, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఒక స్థానంలో గెలుపొందాయి. ఇక ద్రావిడ పార్టీలకు తామే ప్రత్యామ్నాయమని ప్రకటించుకున్న ప్రజాస్వామ్య కూటమి ఒట్టి చేతులతో నిల్చోవాల్సి వచ్చింది. 
 
ఈ ఎన్నికల్లో ఓడిపోయిన నేతల్లో పలువురు ప్రముఖులు ఉన్నారు. డీఎండీకే అధినేత, నటుడు విజయకాంత్, సమత్తువ మక్కల్‌ కట్చి అధినేత శరతకుమార్‌, డీపీఐ అధినేత తిరుమావళవన్, పుదియ తమిళగం నేత డాక్టర్‌ కృష్ణస్వామి, పీఎంకే సీఎం అభ్యర్థి అన్బుమణి, ఆ పార్టీ అధ్యక్షుడు జీకే మణి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి వానతీ శ్రీనివాసన్, దర్శకుడు, నామ్ తమిళర్ పార్టీ అధినేత సీమాన్, రాష్ట్ర మంత్రులు పి. వళర్మతి, గోగుల ఇందిరా, నత్తం విశ్వనాథన్ వంటి అనేక మంది ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి