తమిళనాడుకు పూర్తిస్థాయి గవర్నర్‌గా విద్యాసాగర్ రావు?

సోమవారం, 24 అక్టోబరు 2016 (11:14 IST)
తమిళనాడు రాష్ట్రానికి పూర్తి స్థాయి గవర్నర్‌గా సీహెచ్ విద్యాసాగర్ రావుకే బాధ్యతలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈయన తాత్కాలిక గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న కొణిజేటి రోశయ్య పదవీకాలం ముగియడంతో... ఇంఛార్జ్‌గా విద్యాసాగర్ రావు బాధ్యతలు స్వీకరించారు. 
 
ఆ తర్వాత, పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించాల్సి ఉండటంతో, కేంద్రం పలువురి పేర్లను పరిశీలించింది. గుజరాత్ మాజీ సీఎం ఆనందిబెన్ పటేల్ పేరు దాదాపు ఖరారయినట్టు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే, ఢిల్లీలో తాజాగా కొత్త కసరత్తులు జరుగినట్టు సమాచారం. తమిళనాడుకు పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించడం కన్నా, విద్యాసాగర్ రావుకే పూర్తి బాధ్యతలు అప్పగిస్తే మేలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, విద్యాసాగర్ రావుకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించినట్టే అని తమిళనాడు మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఈ వార్తలకు బలం చేకూర్చేలా, చెన్నైలోని రాజ్‌భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. గవర్నర్ పేరుకు ముందు సాధారణంగా వాడే 'హిజ్ ఎక్సలెన్సీ' అనే పదాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని... 'గవర్నర్ గారు' అని సంబోధిస్తే చాలనేది ఆ ప్రకటన సారాంశం. 

వెబ్దునియా పై చదవండి