అఫిడవిట్‌లో రూ. 4 లక్షల రుణం, రూ. 1.76 లక్షల ఆస్తులు చూపిన అభ్యర్థి... ఎక్కడ?

గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:27 IST)
ప్రస్తుతం తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలతో పాటు 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పలు విచిత్రాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. చెన్నైలోని పెరంబూర్ స్థానానికి నామినేషన్ వేసిన ఓ అభ్యర్థి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో తాను ప్రపంచ బ్యాంక్ నుంచి 4 లక్షల కోట్ల రూపాయల రుణం తీసుకున్నట్లు పేర్కొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. 
 
చెన్నైలోని పెరంబూర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న 67 ఏళ్ల జె. మోహన్ రాజ్ తన ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు. అందులో తనకున్న అప్పుల జాబితాలో ప్రపంచ బ్యాంకు నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నట్లు పేర్కొన్నారు 'ఇతర అప్పులు' అనేచోట 'ప్రపంచ బ్యాంక్ నుంచి రూ.4 లక్షలు' అని పేర్కొన్నారు. ఇక ఆయన వ్యక్తిగత ఆస్తుల విషయానికొస్తే వాటి విలువ రూ.1.76 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. అది కూడా మొత్తం నగదు రూపంలోనే ఉందని పేర్కొనడం మరో విశేషం.
 
ఇన్ని వింతలు, విశేషాలు ఉన్న ఎన్నికల అఫిడవిట్‌తో మోహన్ రాజ్ సమర్పించిన నామినేషన్ పత్రాలను ఎన్నికల సంఘం అధికారులు స్వీకరించారు. గతంలో కూడా ఈయన వేలకోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఆయన 2009 ఎన్నికల్లో తన దగ్గర 1,977 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నట్లు ప్రకటించారు. ఇలా ఎందుకు చెబుతారన్న ప్రశ్నకు ఇది తన దేశభక్తితో కూడిన బాధ్యత అంటారు. 
 
సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని నేతలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి, ఎన్నికల ప్రక్రియను ఎలా నవ్వులాటగా మార్చారో ప్రజలకు తెలియజెప్పేందుకే ఇలా చేస్తున్నానని చెబుతున్నారు. బడా నేతలు ప్రకటించిన ఆస్తుల వివరాలే సరైనవి అయినపుడు తనవి కూడా సరైనవేనని అంటున్నారు. ఒకవేళ ఆ ఆస్తుల వివరాలు చూపమంటే అవి స్విస్ బ్యాంకులో ఉన్నాయని, అక్కడ ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తే ఆ జాబితాలో తన పేరు కూడా ఉంటుందని చెబుతానని ధీమాగా అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు