మిడతల దండుతో తెలంగాణకు నష్టం ఉండకపోవచ్చు?

శుక్రవారం, 29 మే 2020 (07:56 IST)
మిడతల దండు 1993 తర్వాత మళ్లీ ఇప్పుడే మహారాష్ట్ర వైపు వచ్చిందని అగ్రికల్చర్‌ టెక్నాలజీ అప్లికేషన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పదోజోన్‌ డైరెక్టర్‌ వైజీ ప్రసాద్‌ తెలిపారు. ఇవి తెలంగాణ సరిహద్దుకు 400 కి.మీ దూరంలో ఉన్నాయని, రాష్ట్రంలోకి వస్తాయా? రావా? అనేది రెం డురోజుల్లో తెలుస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో ప్ర ధాన పంటలన్నీ పొలాల నుంచి ఇండ్లకు చేరటం తో అవివచ్చినా నష్టం ఉండదని వ్యవసాయరంగ నిపుణులు అంచనావేస్తున్నారు. కూరగాయల పం టలు నష్టపోయే ప్రమాదముందని చెప్తున్నారు.
 
దేశవ్యాప్తంగా తీవ్ర నష్టం
ఉత్తర భారతదేశంలోని పలు రాష్ర్టాల్లో మిడత ల దండు కలకలం రేపుతున్నది. ఏప్రిల్‌ 11న పాకిస్థాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించి, రాజస్థాన్‌లోని సగం జిల్లాలకు విస్తరించి, వేల హెక్టార్లలో పంటలను నాశనం చేశాయి. ఇప్పుడు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, మహరాష్ట్ర మీదుగా కదులుతున్నాయి.

ఈ దండు ను నియంత్రించేందుకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో వ్యవసాయశాఖ అధికారులు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఇవి 15 నిమిషాల్లో 2.5 ఎకరాల్లోని మి డతలపై క్రిమి సంహార రసాయనాలను పిచికారిచేస్తాయి. 54 వాహనాల్లో 800కుపైగా స్ప్రేయర్లతో క్రిమిసంహారకాలను పిచికారి చేస్తున్నారు.
 
పసందైన వంటకం

ఎడారి మిడతలు ఆఫ్రికా, మధ్యప్రాచ్య, ఆసియా ఖండాల్లోని పలు దేశాల ప్రజలకు రుచికరమైన ఆహారం కూడా. వాటిని వేపుడు చేసుకొని ఎంతో ఇష్టంగా తింటారు. వాటిలో ప్రొటీన్లు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాల వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

మానిషి శరీరానికి అవసరమైన అయోడిన్‌, పాస్పరస్‌, ఐరన్‌, థయామిన్‌, రైబోఫ్లేవిన్‌, నియాసిన్‌, కాల్షియం, మెగ్నీషియం, సెలేనియం వంటి పోషకాలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియాలో మిడతల వంటకాలపై 'స్కై ప్రాన్స్‌' (ఆకాశంలోని రొయ్యలు) పేరిట ఓ రెసెపీ పుస్తకం కూడా ప్రచురించారు.
 
ఎడారి మిడత జీవిత చక్రం
బరువు  :   2 గ్రాములు
పొడవు  :    2-3 అంగుళాలు
ఒకసారి పెట్టే గుడ్లు  :80-160  
జీవితకాలం  : 3- 6 నెలలు
ఒక దండులో గరిష్ఠంగా ఉండే సంఖ్య   :   4- 8 కోట్లు
గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చేకాలం :   2 వారాలు
పిల్లలు దండులో చేరటానికి పట్టే కాలం    :    4-6 వారాలు
 
మిడతల దండుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష
మహారాష్ట్ర మీదుగా తెలంగాణ వైపు దూసుకువస్తున్న మిడతలదండుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో మిడతలదండుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మిడతల దండు రాష్ర్టానికి వస్తే చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి అధికారులు, శాస్ర్తవేత్తలు, నిపుణులు హాజరయ్యారు.
 
కొద్దిరోజులుగా పశ్చిమభారతానికే పరిమితమైన ఎడారి మిడతల దండు క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు దూసుకొస్తున్నది. బుధవారం నాటికి మహారాష్ట్రలోని అమరావతి వరకు ఈ మిడతలు చేరుకున్నాయి.

గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ వాటి దారిలో కనిపించే ప్రతీ చెట్టూ చేమను తినేసే ఈ మిడుతలను మహారాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతే రెండుమూడు రోజుల్లో మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదముంది. ప్రస్తుతం 17 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక మిడతల గుంపు మహారాష్ట్రలోని అమరావతి సమీపంలోకి చేరుకుంది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్‌, కామారెడ్డి, అసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలకు వీటితో ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ బీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మిడతల దండు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఈ సమస్యపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సరిహద్దు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిఘాబృందాలు, గ్రా మ కమిటీలను ఏర్పాటుచేసి మిడతల దండుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఒక మిడతల దండు రోజులో దాదాపు 35000 మందికి సరిపోయే ఆహారాన్ని తినేస్తాయని నిపుణులు చెప్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు