ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం

బుధవారం, 16 అక్టోబరు 2019 (06:20 IST)
ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 25వేల మంది హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ప్రకటన చేసింది.

తగినంత బడ్జెట్‌ లేని కారణంగా దీపావళికి ముందే ఇంత భారీ సంఖ్యలో హోంగార్డులను తొలగించడం సంచలనమైంది. యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఆగస్టు 28న జరిగిన సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రయాగరాజ్‌లోని యూపీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులను అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ బీపీ జోగ్దాంగ్‌ జారీచేశారు.
 
రాష్ట్రంలోని పోలీస్‌ కానిస్టేబుళ్లతో సమానంగా హోంగార్డులకు కూడా వేతనాలు చెల్లించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీచేసింది. గతంలో రోజుకు రూ.500లుగా ప్రభుత్వం హోంగార్డులకు వేతనం చెల్లించేది. ఈ తీర్పుతో ఆ వేతనాన్ని రూ.672లకు పెంచాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో బడ్జెట్‌ పరిమితంగా ఉన్న నేపథ్యంలో 25వేల మంది హోంగార్డులు విధుల నుంచి రిలీవ్‌ అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు