ఆత్మీయులు కోల్పోయిన వేదన హృదయ విదారకం : రాహుల్ గాంధీ

శుక్రవారం, 30 జూన్ 2023 (16:46 IST)
మణిపూర్ రాష్ట్రంలో రెండు జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఆత్మీయులను కోల్పోయిన వారి వేదన హృదయ విదారకంగా ఉందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. గత కొన్ని నెలలుగా మణిపూర్‌లో హింసాత్మక, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో ఆ యా ప్రాంతాల్లో రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఆయన శుక్రవారం బిష్ణుపుర్‌‌లోని రెండు పునరావాస శిబిరాలను సందర్శించారు. అక్కడ తలదాచుకుంటోన్న బాధితులను పరామర్శించారు. వారి ఆవేదనతో తన హృదయం చలించిపోయిందన్నారు. రాష్ట్రంలో శాంతిస్థాపన అత్యవసరమని పేర్కొంటూ.. ఈ దిశగా అందరి ప్రయత్నాలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'మణిపుర్‌లో హింసాకాండ కారణంగా ఆత్మీయులను, ఆస్తులను కోల్పోయిన వారి వేదన హృదయ విదారకంగా ఉంది. ప్రతి ఒక్కరి ముఖం.. సాయం కోసం అర్థిస్తున్నట్లు కనిపిస్తోంది. శాంతిస్థాపనే ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన విషయం. ప్రజల జీవితాలు, జీవనోపాధికి భద్రత కల్పించడం అత్యవసరం. ఈ దిశగా మన ప్రయత్నాలన్నీ ఏకం కావాలి' అని ఆయన పిలుపునిచ్చారు 
 
మరోవైపు, రాహుల్ గాంధీ పర్యటనను పోలీసులు తొలి రోజైన గురువారం అడ్డుకున్న విషయం తెల్సిందే. ఘర్షణలకు కేంద్ర బిందువైన చురాచంద్‌పుర్‌ జిల్లాకు బయల్దేరిన ఆయన్ను మార్గ మధ్యంలో పోలీసులు నిలువరించారు. దీంతో ఆయన రోడ్డు మార్గంలో కాకుండా హెలికాప్టర్‌లో చురాచంద్‌పుర్‌కు చేరుకున్నారు. అక్కడి పునరావాస శిబిరంలో తలదాచుకుంటున్నవారిని పరామర్శించారు. శుక్రవారం బిష్ణుపుర్‌లో పర్యటిస్తున్నారు. మరోవైపు రాహుల్ పర్యటనపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు