నా కూతుళ్లను అలా చేశారు.. భర్త, కొడుకు చంపేశారు.. ప్రభుత్వాన్ని తలచుకుంటేనే?

శనివారం, 22 జులై 2023 (08:47 IST)
మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో గత బుధవారం విడుదలైన ఓ వీడియో అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇద్దరు మహిళలను వివస్త్రను చేసి ఊరేగింపుగా తీసుకెళ్లారు. దీనిపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని చర్యలు తీసుకుంటున్నారు. 
 
ఈ సందర్భంగా బాధితురాలి తల్లి తన ఆవేదనను మీడియా ముందు వెల్లగక్కింది. "నా కూతుళ్ల బట్టలు విప్పి ఊరేగింపుగా తీసుకెళ్లేలోపు ఆ గుంపు నా భర్తను, చిన్న కొడుకును హత్య చేసింది. నా చిన్న కొడుకును కోల్పోయాను. వాడు 12వ తరగతి పూర్తిచేశాక, కష్టపడి బాగా చదివించాలని అనుకున్నాను. 
 
ఇప్పుడు అతని తండ్రి లేరు. నా పెద్ద కొడుకుకు ఉద్యోగం లేదు. కాబట్టి నా కుటుంబం గురించి ఆలోచిస్తే, నాకు ఎటువంటి ఆశ లేదు. నేను నిస్సహాయంగా వున్నానని చెప్పడం తప్ప ఇంకేమీలేదు. మా గ్రామానికి వెళ్లే అవకాశాలు లేవు. ఆ ఆలోచన నా మదిలో ఎప్పుడూ రాలేదు. వెనక్కి వెళ్లాలనుకోవడం లేదు. మా ఇల్లు దగ్ధమైంది. పొలం ధ్వంసమైంది. నేను ఎందుకు వెనక్కి వెళ్తాను? 
 
నా గ్రామాన్ని దోచుకున్నారు. నా కుటుంబం భవిష్యత్తు గురించి నాకు తెలియదు. కానీ వెనక్కి వెళ్లేది లేదు. ప్రభుత్వాన్ని తలచుకుంటేనే కోపం వస్తుంది. నా భర్తను, కొడుకును దారుణంగా హత్య చేసి తన కూతుళ్లపై ఈ దారుణానికి పాల్పడ్డారు. మణిపూర్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. 
 
సమాజం ఎటు పోతుందో తెలియట్లేదు. భారతదేశంలో చాలామంది తల్లిదండ్రులు ఏవేవో కోల్పోతున్నారు. ఇలా కోల్పోతే దేశానికి ఏం చేసేది వుండదు. భగవంతుని దయ వల్ల నేను శారీరకంగా బాగానే ఉన్నాను, కానీ పగలు, రాత్రి దాని గురించి ఆలోచిస్తాను. ఇటీవల నేను చాలా బలహీనంగా ఉన్నాను. వైద్యుడిని సంప్రదించాను.." అంటూ ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు