నా తండ్రి అవినీతిపరుడు... టిక్కెటి ఇవ్వొద్దు.. తెరాస ఎమ్మెల్యే కుమార్తె

మంగళవారం, 18 జులై 2023 (09:18 IST)
తన తండ్రి అవినీతిపరుడు అని, ఆయనకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వొద్దని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కుమార్తె తుల్జా భవానీ రెడ్డి అంటున్నారు. గత కొంతకాలంగా తండ్రీ కుమార్తెలకు ఏమాత్రం పొసగడం లేదు. తన పేరిట ఉన్న ఆస్తులను ఫోర్జరీ సంతకాలు చేసి స్వాధీనం చేసుకున్నారంటూ తుల్జా భవానీ ఇటీవల మీడియాకు కూడా చెప్పారు. తాజాగా మరోమారు తండ్రిపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
తన తండ్రి అవినీతిపరుడని, అసలు ఆయనను ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో తెలియదంటూ వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేను ప్రశ్నించాల్సివుంది, ఓడించాల్సింది ప్రజలే అన్నారు. ప్రజల ఆస్తిని తాను తిగిరి ఇచ్చేసినట్టు చెప్పారు. తన తండ్రి నుంచి ఒక్క రూపాయి కూడా తాను తీసుకోలేదన్నారు. కుటుంబం నుంచి తనకు ఎలాంటి మద్దతు లేదన్నారు. భూకబ్జా చేసినట్టు ఒక ఎమ్మెల్యే బహిరంగగా చెప్పినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఇటువంటి అవినీతిపరులకు పార్టీ టిక్కెట్ ఇవ్వకూడదని, సొంతంగా పోటీ చేసినా సర్పంచ్‌గా కూడా తన తండ్రి విజయం సాధించలేడని ఆమె జోస్యం చెప్పారు. 
 
కేవలం సీఎం కేసీఆర్ పేరు చెప్పుకునే తన తండ్రి గత ఎన్నికల్లో గెలిచారని ఆరోపించారు. పైగా, తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఏమాత్రం లేదన్నారు. తనపై ఎన్నో కేసులు పెట్టి  వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. జనగామకు వెళ్లి అడిగితే తన తండ్రి గురించి ప్రతి ఒక్కరూ చెబుతారన్నారు. ఇపుడిపుడే తన తండ్రికి బాధితులు ఫోన్లు చేస్తున్నారు. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు