ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు జవాన్లు మృతి

శనివారం, 18 ఏప్రియల్ 2020 (20:06 IST)
జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌ సమీపంలో శనివారం పెద్ద ఎత్తున ఉగ్రవాదులు, జవాన్ల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఉగ్రవాద దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

అహాగ్‌బాబ్ క్రాసింగ్ సమీపంలో ఉన్న నూర్బాగ్ వద్ద సీఆర్‌పీఎఫ్‌, పోలీసులపై  ఉగ్రవాదులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు.  వెంటనే తేరుకున్న జవాన్లు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలోనే ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
సోపోర్ పట్టణంలో విధుల్లో ఉన్న సీఆర్‌పీఎఫ్‌ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారని స్థానిక ఎస్పీ తెలిపారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతి చెందారని, డ్రైవర్‌తో సహా ముగ్గురు పారా మిలటరీ సైనికులు గాయపడ్డారని ఎస్పీ ధృవీకరించారు.

కాగా సంఘటన జరిగిన వెంటనే దాడికి తెగబడిన వారిని పట్టుకోవడానికి భద్రతా దళాలు  సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని ఎస్పీ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు