ఓ కామాంధుడి నుంచి ఆమెను రక్షించబోయి బావ ప్రాణాలు కోల్పోయాడు. మామ మాత్రం తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లా మంగళం వీపీ కుప్పానికి చెందిన రైతు ఏళుమలై. ఈయనకు కుమార్ (43), సెల్వం (40) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్యం కారణంగా రెండేళ్ల క్రితం రెండో కుమారుడు సెల్వం మృతి చెందాడు. దీంతో అతని భార్య అంజలి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒంటిగా జీవిస్తోంది.
అయితే, కూత్తాండవర్ పురానికి చెందిన కార్తికేయన్ అనే బంధువు ఆమెపై కన్నేసి, లైంగికంగా వేధించసాగాడు. దీంతో వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి మద్యం సేవించి అంజలి ఇంటికి వచ్చిన కార్తికేయన్ ఆమెతో గొడవ పడ్డాడు.
ఈ విషయం తెలుసుకున్న అంజలి మామ, బావలు అక్కడికి చేరుకుని కార్తికేయన్ను అడ్డుకునేందుకు యత్నించారు. అయితే, మద్యం సేవించివున్న కార్తికేయన్.. తీవ్ర కోపోద్రేకానికిలోనై.. ఇంట్లో ఉన్న మారణాయుధంతో అతనిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కుమార్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, అతని తండ్రి ఆస్పత్రి పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.