యూట్యూబ్ మానిటైజేషన్ కోసం.. దారుణానికి ఒడిగట్టిన ప్రభుత్వ టీచర్... ఏంటది?

ఠాగూర్

ఆదివారం, 7 ఏప్రియల్ 2024 (12:24 IST)
తన భార్య యూట్యూబ్ చానల్‌కు మానిటైజేషన్ కోసం ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓ దారుణానికి తెగబడ్డాడు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ప్రభుత్వం నిర్వహించే వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశఆరు. ఈ విషయం వైరల్ కావడం, అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో విద్యాశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఒరిస్సా రాష్ట్రంలోని జజ్పూర్ జిల్లాలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాల్లోని గోపీనాథ్ జ్యూ నోడల్ పాఠశాలలో జగన్నాథ్ కార్ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నట్టు ఒడిశా స్కూల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ తెలిపారు. 1 నుంచి 8వ తరగతి వరకూ ప్రశ్న పత్రాలు లీక్ అయినట్టు తొలుత తమకు సమాచారం అందిందని సదరు అధికారి తెలిపారు. విచారణ సందర్భంగా కార్ పేరు వెలుగులోకి వచ్చిందన్నారు.
 
పరీక్షలకు దాదాపు వారం రోజుల ముందు మార్చి 9న నిందితుడు క్లస్టర్ రీసెర్చ్ కోఆర్డినేటర్ నుంచి ఇటారా ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ తరుపున ప్రశ్నపత్రాలు తీసుకున్నాడని తెలిపారు. వాటిని నేరుగా స్కూలుకు తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకొచ్చి ఫోన్‌తో ఫొటోలు తీసి తన భార్య యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేశాడని తెలిపారు. ఫలితంగా వారి ఛానల్ సబ్‌స్కైబర్లు సంఖ్య ఒక్కసారిగా 5 వేల నుంచి 30 వేలకు చేరుకుందని అన్నారు. 
 
ఈ నేపథ్యంలో యూట్యూబ్ ద్వారా నిందితులు ఎంత డబ్బు సంపాదించారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కేసులో పోలీసులు ప్రభుత్వ టీచర్ భార్య పేరును కూడా కుట్రదారుగా చేర్చారు. అయితే, ఆమె పసిబిడ్డ తల్లి కావడంతో ఇంకా అదుపులోకి తీసుకోలేదని తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు