ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో మరోమారు భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్, కాంకెర్ జిల్లాల్లో రెండు ఎన్కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోల దాడిలో ఓ జవాను మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
బీజాపూర్ - దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో పెద్దఎత్తున మవోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు అడవుల్లో గురువారం ఉదయం నుంచే కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో మావోలు ఎదురపడి కాల్పులు జరిపారు. దాంతో వారిపై భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు.
ఘటనాస్థలం నుంచి 18 మంది మావోయిస్టులు మృతదేహాలతో పాటు తుపాకులు, భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయని, భద్రతా సిబ్బంది వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తాయని అధికారులు చెప్పారు. అయితే, ఈ ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.
ఇదేసమయంలో కాంకెర్ జిల్లాలోనూ మరో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఇక్కడ బీఎస్ఎఫ్, డీఆర్జీ బలగాలు సంయుక్తంగా జరిపిన కూంబింగ్ ఆపరేషన్లో నలుగురు మవోయిస్టులను మట్టుబెట్టాయి. ప్రస్తుతం రెండు జిల్లాల్లోనూ యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతుండటంతో మరణాలు సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.