నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ .. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తాం : మంత్రి ధర్మేంద్ర

వరుణ్

బుధవారం, 24 జులై 2024 (12:37 IST)
నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పును తాము స్వాగతిస్తామని కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నీట్ యూజీ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు మంగళవారం తీర్పునిచ్చిన విషయం తెల్సిందే. ఈ తీర్పుపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ అయింది వాస్తవమేనని, అయితే చాలా కొద్ది స్థాయిలోనే లీక్ కావడం వల్ల, మళ్లీ నీట్ పరీక్ష జరపాల్సిన అవసరం లేదని ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. 
 
నీట్ పేపర్ లీక్ పరిమితి స్థాయిలోనే జరిగిందని తాము మొదటి నుంచి చెబుతున్నామని, తాము ఎప్పటి నుంచో చెబుతున్నదే ఈ రోజు సుప్రీంకోర్టు కూడా చెప్పిందన్నారు. అయితే, నీట్ పేపర్ లీక్ అంశంపై విపక్షాలు అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. 
 
సత్యమే గెలిచిందని, అందువల్ల నీట్ ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొనడం హర్షణీయమని తెలిపారు. ఇక, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో, మరో రెండు రోజుల్లో నీట్ యూజీ ఫలితాలను ఎన్టీయే విడుదల చేస్తుందన్నారు. అత్యున్నత న్యాయస్థానం పరిశీలించిన మేరకు నీట్ యూజీ మెరిట్ లిస్టును సవరిస్తామని మంత్రి వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు