జైలులో ఖైదీల వీరంగం: అధికారులపై వేటు..

గురువారం, 27 జూన్ 2019 (16:15 IST)
సాధారణంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు నాలుగు గోడల మధ్య బందీలుగా జైలు జీవితం గడుపుతుంటారు. అలాంటి ఖైదీలు జైలులో నానా హంగామా సృష్టించారు. యూపీ రాష్ట్రంలోని ఉన్నావ్ జైలులో కొంత మంది ఖైదీలు మద్యం సేవించి, బహిరంగంగా హెచ్చరికలు చేయడంతో పాటు ఆయుధాలు చేపట్టిన వీడియోలు కలకలం రేపాయి.


ఈ ఘటనకు సంబంధించి యూపీ ప్రభుత్వం నలుగురు అధికారులపై చర్యలు తీసుకుంది. సంబంధిత అధికారులను బదిలీ చేయడంతో పాటు ఆ వీడియోలో నానా రచ్చ చేసిన ఖైదీలను వేరే జైళ్లకు బదలాయించారు.
 
బయటకొచ్చిన వీడియోలలో ఓ ఖైదీ తుపాకీ ఎక్కుపెడుతూ మీరట్ జైలు అయినా లేదా ఉన్నావ్ జైలు అయినా తాను ఇలాగే ఉంటానని, జైలు బయట ఎవరినైనా హతమారుస్తానని రెచ్చిపోయాడు. ఇంకొక ఖైదీ హిందీ సినిమాలోని డైలాగ్ చెప్తూ తనపై ఏ అధికారి చర్య తీసుకోవడానికి ధైర్యం చేయబోరని అంటున్నాడు. తాను దేవ్‌ ప్రతాప్‌ సింగ్‌నని చెబుతూ అధికారులకే సవాల్‌ విసిరాడు.
 
అంతేకాకుండా తనకు జైలు అంటే ఆఫీస్ అని, ఏ జైలులోనైనా తాను హాయిగా బతికేస్తానని సదరు ఖైదీ చెప్పడం విశేషం. ఖైదీలు సృష్టించిన వీరంగంపై యూపీ జైళ్ల శాఖ మంత్రి జై కుమార్ సింగ్ ఘూటుగా స్పందించారు. ఈ ఉదంతంపై డీఐజీ వివరణ కోరామని, నలుగురు అధికారులపై శాఖాపరమైన విచారణ ప్రారంభమైందని, అలాగే అధికారులను వేరే ప్రాంతానికి బదిలీ చేసినట్లు చెప్పారు. కాగా ఖైదీలు చూపిన తుపాకులు నిజమైనవి కావని డమ్మీవి అని జైలు అధికారులు పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు