పెళ్లైపోయింది.. కానీ ప్రియురాలిని లేపుకెళ్లాలనుకున్నాడు.. చివరికి?

శుక్రవారం, 25 డిశెంబరు 2020 (14:40 IST)
ప్రియురాలిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ అమ్మాయి తరపు వారు వారి ప్రేమను అంగీకరించలేదు. వేరే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేశారు. పెళ్లి చేసుకుని ప్రియురాలు అత్తారింట అడుగు పెట్టింది. వేరే యువకుడినిపెళ్లి చేసుకుని వెళ్లిపోయిన ప్రియురాలిని మరచిపోలేకపోయాడు. ప్రియురాలిని తీసుకెళ్లిపోవాలని స్నేహితులతో కలిసి ప్లాన్ వేసి ప్రాణాలు కోల్పోయాడు. ఈ షాకింగ్ ఘటన యూపీలోని డియోరియా జిల్లాలో జరిగింది. యూపీ సరిహద్దు బిహార్‌లోని శివన్‌కి చెందిన పంకజ్ మిశ్రా(25) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 8న డియోరియా జిల్లాకి చెందిన వికాస్ పాండేతో వివాహం జరిగింది. ప్రియురాలికి పెళ్లైపోవడంతో తట్టుకోలేకపోయిన పంకజ్.. ఆమెను ఎలాగైనా తీసుకెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అర్థరాత్రి వేళ తన స్నేహితులతో కలసి ఆమె అత్తింటికి వెళ్లాడు. కొత్త కోడలిని తీసుకెళ్లేందుకు వచ్చిన యువకులను చూసి ఆమె భర్త, మామ అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య గొడవ జరగడంతో భర్త వికాస్ పాండే, మామ జితేంద్ర పాండేకి గాయాలయ్యాయి. ఆ విషయం గ్రామస్తులకు తెలియడంతో వెంటనే పంకజ్‌ మిశ్రాని చుట్టుముట్టారు.
 
ఆ గ్రామస్థులు అంతా కలిసి ప్రియుడు పంకజ్ మిశ్రా తీవ్రగాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంకజ్‌ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పంకజ్ మిశ్రా ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు