ఈ రోజుల్లో వివాహం చేయాలంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సివుంది. పేద తరగతికి చెందిన కుటుంబమే ఒక పెళ్లి కోసం ఏకంగా లక్షలాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అలాంటిది ఒక కలెక్టర్ వివాహమంటే ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోండి. కానీ ఈ కలెక్టర్ మాత్రం ఆడంబరాలకూ దూరంగా ఉండి తన వివాహాన్ని అత్యంత సాదాసీదాగా, కేవలం దండల మార్పిడితో పూర్తి చేసుకున్నారు. ఆ కలెక్టర్ పేరు డాక్టర్ సందీప్ తివారీ. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా కలెక్టర్.
బుధవారం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో వీరి వివాహం జరిగింది. వధువు, వరుడు డాక్టర్ పూజా ధలకోటి, డాక్టర్ సందీప్ తివారీలు రిజిస్ట్రార్ ముందు దండలు మార్చుకోవడంతో వీరి వివాహం పూర్తయింది. ఆ తర్వాత నూతన దంపతులిద్దరూ చమోలీ గోపేశ్వర్ టౌన్షిప్లో ఉన్న గోపీనాథ ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఈ దంపతులు దిగిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డబ్బు లేకపోయిన అప్పు చేసిమరీ ఆడంబరాలకు వెళ్ళే నేటి జనరేషన్కు ఆదర్శంగా నిలిచారంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
కాగా, 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సందీప్ తివారీ గత ఆరేళ్లుగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సేవలు అందిస్తున్నారు. వధువు డాక్టర్. వీరిద్దరూ మనసువిప్పి మాట్లాడుకుని, ఒక ఏకాభిప్రాయానికి వచ్చాక రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు.