బెంగాల్‌‍లో తృణమూల్ కంటే బీజేపీకి ఓటు వేయడం బెటర్ : అధిర్ రంజన్ చౌదరి

ఠాగూర్

గురువారం, 2 మే 2024 (10:59 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం ఎంతో మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇపుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. జాతీయ స్థాయిలో టీఎంసీ, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. అయితే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో మాత్రం ఈ రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఈ సమయంలో అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై టీఎంసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీకి కాంగ్రెస్ బీ-టీమ్ పని చేస్తోందని ఆరోపించింది. అయితే టీఎంసీ తమ మిత్రపక్షమని, బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసింది.
 
పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ లోక్‌సభ పరిధిలో ఇటీవల ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో అధిర్ రంజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలను బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. దీంతో తృణమూల్ కాంగ్రెస్ అధిర్ రంజన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో మమతా బెనర్జీ పోరాడుతుంటే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి మాత్రం బీజేపీకి ఓటు వేయమని చెప్పడం ఏమిటని టీఎంసీ ఎంపీ సాకేత్ గోఖలే ప్రశ్నించారు.
 
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ స్పందించారు. బెంగాల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యమన్నారు. అధిర్ రంజన్ ఏ సందర్భంలో అలా మాట్లాడారో తెలియదన్నారు. రాష్ట్రంలో బీజేపీని కట్టడి చేయడమే తమ ధ్యేయమన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలుచుకుందని, ఈసారి ఈ సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తామని జైరాం రమేష్ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు