బెంగాల్‌లో డిస్కో డ్యాన్సర్‌కు ఝులక్ ఇచ్చిన కమలనాథులు!

బుధవారం, 24 మార్చి 2021 (08:54 IST)
బాలీవుడ్ స్టార్ హీరో, డిస్కో డ్యాన్సర్ మిథున్ చక్రవర్తికి కమలనాథులు తేరుకోలేని షాకిచ్చారు. ఈయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీని వీడి ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి కారణం... బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ ఆశించారు. కానీ, కమలనాథులు ఆయనకు మొండిచేయి చూపించారు. 
 
నిజానికి టీఎంసీని వీడి బీజేపీలో చేరిన మిథున్ చక్రవర్తిని ఓ దశలో ఆయనని బెంగాల్ సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించే అవకాశం ఉందన్న ఊహాగానాలూ వెలువడ్డాయి. తీరా చూస్తే ఆయనకు కనీసం అసెంబ్లీ టిక్కెట్ కూడా దక్కలేదు. 
 
తుది జాబితాలో మిథున్ పేరు ఉంటుందని ఆశించినా.. మొండిచేయే మిగిలింది. మంగళవారం 13 మంది పేర్లతో విడుదల చేసిన బీజేపీ అభ్యర్థుల తుది జాబితాలో మిథున్ చక్రవర్తి పేరు లేకపోవడం గమనార్హం.
 
ఇంతకుముందు విడుదల చేసిన జాబితాల్లో ఆయన పేరు లేకపోయినప్పటికీ.. రాష్‌బెహారీ స్థానం నుంచి మిథున్‌కే అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానంలో ఆయనకు బదులు రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహాని బరిలోకి దింపారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడ్డ క్లిష్ట పరిస్థితుల్లో సుబ్రత కాశ్మీర్‌ ఇంచార్జీగా పని చేశారు.
 
కాగా, మార్చి 7న కోల్‌కతాలోని బ్రిగేడ్ పెరేడ్ మైదానంలో బీజేపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మిథున్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి వేదికను పంచుకున్నారు. కానీ, అవేమీ మిథున్ చక్రవర్తికి సానుకూలాంశాలుగా పనిచేయలేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు