కృష్ణశాస్త్రి జన్మదినం సందర్భంగా ప్రసంగ గోష్ఠి

ప్రముఖ భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి 113వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తులతో ప్రసంగ గోష్ఠిని నిర్వహించనున్నట్లు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఒక ప్రకటనలో తెలియజేసింది. "నెలనెలా తెలుగు వెన్నెల" 21వ కార్యక్రమంగా జరిగే ఈ ప్రసంగ గోష్ఠిని వంగూరి ఫౌండేషన్, త్యాగరాయ గానసభలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.

కాగా.. హైదరాబాద్‌ నగరంలోని త్యాగరాయ గానసభలో నవంబర్ 8వ తేదీ ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో దేవులపల్లితో ప్రత్యక్ష పరిచయం ఉన్న పాలగుమ్మి విశ్వనాథం, డాక్టర్ నిడమర్తి నిర్మలాదేవి, తురగా జానకీరాణి, పచ్చిపులుసు వెంకటేశ్వర్లు.. తదితరులు హాజరై తమ అనుభవాలను పంచుకోనున్నారు.

ఈ సభకు ముఖ్య అతిథిగా జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, పద్మభూషన్ డాక్టర్ సి. నారాయణరెడ్డి హాజరు కానున్నారు. శిరోమణి వంశీ రామరాజు అధ్యక్షత వహించే ఈ సభలో త్యాగరాయ గానసభ అధ్యక్షుడు కళా వేంకట దీక్షితులు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేయనున్నారు.

వెబ్దునియా పై చదవండి