దేశ భవిష్యత్తులో పాలుపంచుకునే అర్హత ఎన్ఆర్ఐలకు లేదా...?
FILE
విదేశాలలో నివశిస్తున్న ప్రవాస భారతీయుల కోసం భారత పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఎన్ఆర్ఐ ఓటింగ్ హక్కుల బిల్లుపై రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలలో చర్చ జరుగనుంది. విదేశాలలో నివశిస్తున్న భారతీయ సంతతి వ్యక్తులకు ఓటు వేసే హక్కును కల్పించాలంటూ ఆగస్టు, 2010లో రాజ్యసభలో ఓ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో నవంబర్ 9, 2010 నుంచి నవంబర్ 14, 2010 వరకూ జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాలలో లోక్సభ ఈ బిల్లుపై చర్చించనుంది. ఈ బిల్లు ప్రకారం తమ ఓటు హక్కును వినియోగించుకోదలచిన సదరు ఎన్ఆర్ఐలు భారత్లో ఎన్నికలు జరిగే రోజున ప్రత్యక్షంగా(భౌతికంగా) హాజరై తమ తమ ఓట్లను వినియోగించుకోవాల్సి ఉంటుంది.
అయితే ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్లమంది భారతీయులు నివశిస్తున్నారు. వీరంతా ఒకేసారి భారత్లో జరిగే ఎన్నికలకు హాజరు కావడం అసాధ్యం. ఇందుకు ఓ చిన్న ఉదాహరణగా అమెరికాలో నివశిస్తూ.. ఓటు హక్కుకు అర్హులైన భారతీయలను గనుక చూస్తే.. కింది విధంగా ఉన్నారు.
1. విద్యార్థులు: 2 లక్షలు 2. హెచ్1-బి వీసా కలిగిన వారు: గత ఐదేళ్లుగా చూస్తే సగటున సుమారు 3 లక్షల మంది ఉండవచ్చు 3. గ్రీన్ కార్డ్ (శాస్వత పౌరసత్వం): ఐదు లక్షల మంది.
అంటే ఒక్క అమెరికాలోనే సుమారు 10 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వీరంతా ఒకేసమయంలో భారత్కు వచ్చి తమ ఓటును వినియోగించుకోవడం అసాధ్యం. అమెరికా నుంచి భారత్కు వస్తున్న అన్ని విమానాల ద్వారా భారతీయులను తరలించాలన్నా పది లక్షల మంది ప్రయాణికులను తరలించడానికి 100 రోజుల సమయం పడుతుంది.
ఒకవేళ ఓటింగ్ రోజున (99వ రోజు) భారత్ వచ్చిన వ్యక్తులు తిరిగి అమెరికాకు వెళ్లాలంటే 98వ రోజున వచ్చిన వ్యక్తులు తిరిగి అమెరికాకు వెళ్లే వరకూ వేచి ఉండాల్సిందే. కాబట్టి అంత సమయం వరకూ వేచి ఉండటం అనేది సుళువైన అంశం కాదు. పైపెచ్చు ఈ సమయంలో సదరు వ్యక్తి తన విలువైన సమయాన్ని, ధనాన్నినష్టపోవాల్సి వస్తుంది. ఈ పది లక్షల మంది ప్రజలు అమెరికా నుంచి భారత్ రావడానికి మరియు ఈ సమయంలో జరిగే ఉద్యోగ నష్టం ద్వారా సుమారు 500 కోట్ల రూపాయాలు వృధా అవుతాయి.
ఈ నేపధ్యంలో అక్టోబర్ 31, 2010 తేదీన మిల్పిటాస్లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్ (ఐసిసి) వద్ద భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు సమావేశం కానున్నారు. ఆదివారం జరిగే ఈ సమావేశం మ. 2.00 నుంచి 4.00 వరకూ జరుగుతుంది. ఈ సమావేశం ద్వారా "ఎన్ఆర్ఐ పరోక్ష ఓటింగ్ హక్కు" అనే సందేశాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయనున్నారు.
ఈ సమావేశంలో పలు సాంస్కృతిక సంఘాలు కూడా పాలుపంచుకోనున్నాయి. ఎన్నికల సమయంలో లక్షలాదిమంది ఎన్ఆర్ఐలు భారత్కు ప్రయాణించడం అసాధ్యం. చాలా దేశాలు విదేశాలలో నివసిస్తున్న వారి ప్రజలకు ఈ పరోక్ష ఓటింగ్ హక్కును కల్పిస్తుండగా.. ప్రవాస భారతీయులకు మాత్రం ఈ అవకాశాన్ని ఎందుకు కల్పించకూడదు...? భారతదేశ భవిష్యత్తులో పాలుపంచుకునే అర్హత ఎన్ఆర్ఐలకు లేదా...?
ఈ అంశంపై మీరు సంప్రదించాల్సిన ఇ- మెయిల్ చిరునామా... ఎన్ఆర్ఐవోటింగ్రైట్స్ ఎట్ జిమెయిల్ డాట్ కామ్