మహాభారత కాలంలో మాఘ శుద్ధ సప్తమినాడు అనగా రథ సప్తమి లేక సూర్య సప్తమి సూర్యుని రధం ఉత్తరం వైపు తిరిగే రోజు ఉత్తరాయణ పుణ్యకాలంగా సూర్యుని అయన గతి మారేదని తెలుస్తుంది. మర్నాడే మాఘ శుద్ధ అష్టమి దీనినే భీష్మాష్టమి అని అంటారు. భీష్ముడు అంపశయ్య మీద ప్రాణ త్యాగం చేసిన రోజు. కనుక మాఘ శుక్లపక్ష అష్టమియే భీష్మ నిర్యాణ దినంగా భావిస్తారు.
పద్మ పురాణంలో హేమాద్రి వ్రత ఖండంలో భీష్మాష్టమి గురించి చెప్పబడింది. భీష్మాష్టమి రోజున భీష్మునికి తిలాంజలి సమర్పించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. దీపారాధనకు తామరవత్తులు వాడాలి. ఇంకా దేవాలయాల్లో విష్ణు అష్టోత్తరము, సత్యనారాయణ వ్రతం, బ్రహ్మోత్సవ దర్శనం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం, పేదలకు అన్నదానం, గోవులకు గ్రాసం ఇవ్వడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి.
ఇకపోతే.. ఫిబ్రవరి 5వ తేదీన బుధాష్టమి వ్రతం కూడా వస్తోంది. ఈ వ్రతం మన తెలుగునాట అంత ఆచరణలో లేదు. కానీ ఈ రోజు బుధగ్రహానికి విశిష్టమైన రోజు. ఈ రోజున బుధగ్రహానికి పెసరపప్పును దానం చేయడం.. ఆ పప్పు చేసే వంటకాలను బుధగ్రహానికి సమర్పించడం చేస్తే సర్వశుభాలు చేకూరుతాయి. అలాగే ఈ రోజున శివవిష్ణువులను పూజించాలి. ఇలా చేస్తే గ్రహసంబంధమైన దోషాలు తొలగిపోవాలనీ, జీవితంలో కష్టాలన్నీ తొలగిపోతాయి.