మహాలయ అమావాస్యకు కర్ణునికి సంబంధం వుందా?

సోమవారం, 8 అక్టోబరు 2018 (12:33 IST)
మహాలయ అమావాస్య రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే మానసిక ప్రశాంతత, ఆయుర్దాయం చేకూరుతుంది. ఇంకా ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. మహాలయ అమావాస్య రోజున రోజున శివుడిని పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయి అదృష్టం వరిస్తుంది. మహాలయ అమావాస్య రోజున అమావాస్య నాడు పవిత్ర స్నానాలు చేయడంతో పాటుగా దానాలు, పితృపక్షాలు చేస్తే శుభం కలుగుతుంది.
 
దానశీలిగా పేరు సంపాదించిన కర్ణునికి మరణానికి తర్వాత స్వర్గం ప్రాప్తించింది. కానీ ఆయన స్వర్గలోకానికి వెళుతుండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. పండు కోసుకుని తిందామనుకున్నాడు. కానీ ఆ పండు కాస్తా బంగారపు ముద్దగా మారిపోయింది. అలాగే దప్పిక తీర్చుకుందామని సెలయేటి నీటిని తాగాలనుకున్నా.. అవి కాస్తా బంగారు నీరుగా మారిపోయాయి. స్వర్గలోకానికెళ్లినా కర్ణునికి ఇదే పరిస్థితి ఏర్పడింది. 
 
దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నదని వాపోయాడు . ఆ సమయంలో ఓ కర్ణా.. దానశీలిగా పేరు సంపాదించినప్పటికీ.. చేసిన దానాలన్నీ బంగారు, వెండి, డబ్బు రూపేణా చేశావు. కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే ఈ స్థితి ఏర్పడిందని శరీరవాణి పలుకుల ద్వారా తెలుసుకుంటాడు. 
 
ఆ తర్వాత కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకెళ్లి వేడుకోగా.. ఆయన కోరిక మేరకు ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. కర్ణుడిని వెంటనే భూలోకానికెళ్లి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమినాడు భూలోకానికి చేరాడు. 
 
అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నసంతర్పణ చేశాడు. పితరులకు తర్పణలు వదిలాడు. తిరిగి అమావాస్యనాడు స్వర్గానికెళ్లాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి, తిరిగి స్వర్గానికెళ్లిన ఈ పక్షం రోజులకే మహాలయపక్షమని పేరు. ఈ మహాలయ పక్షములో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు