పరమశివుడికి పంచామృతంతో అభిషేకం చేయిస్తే?

గురువారం, 29 జనవరి 2015 (17:22 IST)
పరమశివుడికి పంచామృతంతో అభిషేకం చేయిస్తే.. సిరిసంపదలు చేకూరుతాయి. పరమశివుడికి చేసే అభిషేకం జన్మజన్మల పాపాలను కడిగేస్తుంది. అనంతమైన పుణ్యఫలాలను అవలీలగా అందిస్తుంది. సాధారణంగా శివుడికి పంచామృతాలతోను పండ్లరసాలతోను అభిషేకం చేస్తుంటారు. ఆవుపాలు, ఆవుపెరుగు, ఆవునెయ్యి, తేనె, నీరును పంచామృతాలని అంటారు.
 
పంచామృతాలతో చేయబడే అభిషేకం సాక్షాత్తు పరమశివుడి వరాన్ని అందిస్తుంది. ఇక ఈ ఐదింటిలో ఒక్కో అభిషేక ద్రవ్యంతో చేసే అభిషేకం ఒక్కో విశేషమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది.
 
ఈ అభిషేక ద్రవ్యాలలో ఆవుపెరుగు ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఆవు పెరుగుతో శివుడిని అభిషేకించడం వలన 'ఆరోగ్యం' కలుగుతుంది. అనారోగ్యాలు దూరమవుతాయి. ఇక ఆవు పెరుగును ఒక ఒక వస్త్రంలో వుంచి మూటకట్టి దానిలోని నీరంతాపోయేలా పిండి, ఆ వస్త్రంలో మిగిలిపోయిన మెత్తటి పదార్ధంతో శివలింగం తయారుచేసి పూజించవచ్చు. 
 
అలా పెరుగు నుంచి వచ్చిన మెత్తటి పదార్థంతో శివలింగం తయారు చేసుకుని దానిని పూజించడం వలన సిరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి